మంత్రి లోకేశ్‌ను కలిసిన ఉద్యోగ సంఘాలు.. రిటైర్మెంట్ వయసు పెంపుపై హర్షం

  • సంస్థలు, కార్పొరేషన్ల ఉద్యోగుల రిటైర్మెంట్ వయసు 62 ఏళ్లకు పెంపు
  • ప్రభుత్వ నిర్ణయంపై మంత్రి లోకేశ్‌కు కృతజ్ఞతలు తెలిపిన ఉద్యోగ సంఘాలు
  • పీఆర్సీ కమిటీ ఏర్పాటు, పెండింగ్ బిల్లుల చెల్లింపుపై నేతల విజ్ఞప్తి
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ రంగ సంస్థలు, కార్పొరేషన్ల ఉద్యోగుల పదవీ విరమణ వయసును 60 నుంచి 62 ఏళ్లకు పెంచుతూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై ఉద్యోగ సంఘాల నేతలు హర్షం వ్యక్తం చేశారు. మంత్రి లోకేశ్‌ను క్యాంప్ కార్యాలయంలో ఏపీ జేఏసీ ఛైర్మన్, ఏపీ ఎన్జీవో సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఎ. విద్యాసాగర్ నేతృత్వంలోని ప్రతినిధి బృందం కలిసి కృతజ్ఞతలు తెలిపారు.

ఈ సందర్భంగా, పే రివిజన్ కమిషన్ (పీఆర్సీ) కమిటీని వెంటనే నియమించాలని, పెండింగ్‌లో ఉన్న గ్రాట్యుటీ, సరెండర్ లీవ్ బిల్లులను త్వరగా క్లియర్ చేయాలని ఉద్యోగ సంఘాల నేతలు మంత్రిని కోరారు. మహిళా ఉద్యోగులకు చైల్డ్ కేర్ లీవ్ నిబంధనల సడలింపుపై కూడా వారు సంతోషం వ్యక్తం చేశారు. మంత్రిని కలిసిన వారిలో విద్యాసాగర్‌తో పాటు రమణ, ప్రసాద్ జానకి, సరస్వతి, సురేఖ తదితరులు ఉన్నారు.

ఇటీవల మంత్రులు నారా లోకేశ్, పయ్యావుల కేశవ్, పి. నారాయణలతో కూడిన మంత్రివర్గ ఉపసంఘం ఈ కీలక నిర్ణయం తీసుకుంది. దీనివల్ల 50కి పైగా కార్పొరేషన్లు, సొసైటీలు, గురుకుల పాఠశాలల్లో పనిచేస్తున్న సుమారు 10 వేల మంది ఉద్యోగులకు లబ్ధి చేకూరనుంది.
 

Nara Lokesh
AP JAC
AP NGO
Government employees
Retirement age hike
Andhra Pradesh
PRC
Gratuity
Child care leave
Pay Revision Commission

More Telugu News